హైదరాబాద్ (ప్రైమ్టుడే నెట్వర్క్): ఏపీ తెలంగాణల మధ్య నీటి యుద్ధానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా లేదు.. పరిస్థితి మాటల యుద్ధం దాటి.. కేంద్రం దగ్గరకు పంచాయతీ చేరింది. అయినా కృష్ణా జగడం రాజుకుంటూనే ఉంది. ఆ జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కేంద్రం గెజిట్పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సర్కార్ తాజాగా.. Krishna River Management Board కి లేఖ రాసింది. కృష్ణా జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ ఆ లేఖలో కోరింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకూ కృష్ణా జలాల్ని ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది కేసీఆర్ సర్కార్. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని విజ్ఞప్తి చేసింది. క్యాచ్మెంట్ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం.. ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు తెలంగాణ ENC మురళీధర్.
మరి దీనిపై కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందో.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఇటీవల కేంద్రం అటు గోదావరి, ఇటు కృష్ణా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ గెజిట్ రిలీజ్ చేసింది. గెజిట్ ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ సైతం బోర్డులే చూసుకోనున్నాయి. ఈ గెజిట్పై తెలంగాణ మండిపడుతోంది. గెజిట్తో మరోసారి అన్యాయం కేంద్రం అన్యాయం చేస్తోందని తెలంగాణ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నదీ పరివాహకం తమ ప్రాంతంలోనే అధికంగా ఉంది అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ 68 శాతం నదీ పరివాహకం ఉందని.. దాని ప్రకారం నీటి కేటాయింపులు జరపాలని లేఖలో కోరింది. అత్యల్ప పరీవాహకం ఉన్న ఏపీకి అధిక నీటి కేటాయింపులేంటని బోర్డు తీరును ప్రశ్నిస్తోంది. కృష్ణా నీటిని పెన్నా బేసిన్కు ఏపీ తరలించుకుపోతోందని ఎప్పటినుంచో వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి లేఖలో అదే విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతోంది.