రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఒక వైపు అతివృష్టి.. మరో వైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసి లేని పరిస్థితి తీసుకువస్తున్నాయి. దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. పట్టెడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం యావత్ భారతవనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకొంటారు.
చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందరీ చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17న జరుపుతారు.
అయితే మనదేశం తమకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని ఎంచుకున్నారు. ఆయన పార్లమెంట్ని ఎదుర్కొలేకపోయి తాత్కాలిక ప్రధానిగానే 1980లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29న మరణించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చరణ్ సింగ్ .. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం డిసెంబర్ 23న కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా భారత దేశంలో జరుపుకొంటారు.